కలం, వెబ్ డెస్క్: వియత్నాంలోని డా నాంగ్లో జరుగుతున్న యూ-23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. టోర్నీ తొలిరోజే భారత్కు రెండు పతకాలు ఖాయం చేస్తూ సాగర్ సింగ్, సూరజ్ ఫైనల్కు దూసుకెళ్లారు. తీన్ సన్ స్పోర్ట్ సెంటర్లో జరిగిన గ్రెకో-రోమన్ విభాగం మ్యాచ్ల్లో వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చేశారు. పోటీల వివరాల్లోకి వెళ్తే.. మొదట 67 కేజీల విభాగంలో సాగర్ సింగ్ తన వ్యూహాత్మక ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసి ఫైనల్ చేరాడు.
అదే ఉత్సాహంతో 60 కేజీల విభాగంలో సూరజ్ కూడా అద్భుతమైన పట్టుదలతో మ్యాచ్లు గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. దీంతో భారత్కు కనీసం రెండు రజత పతకాలైనా రావడం ఖాయమైంది. మరోవైపు 77 కేజీల విభాగంలో కుమార్ సచిన్ సెమీఫైనల్ వరకు వెళ్లినా, అలీఖాన్ దుర్సోనోవ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయాడు. అలాగే 72 కేజీలు, 82 కేజీల విభాగాల్లో బరిలోకి దిగిన మిగతా భారత రెజ్లర్లు గట్టి పోటీ ఎదురవడంతో ముందస్తు రౌండ్లలోనే వెనుదిరిగారు.
భారత రెజ్లర్ల ఆటతీరుపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫైనల్ చేరిన ఆటగాళ్లకు ఆయన అభినందనలు తెలిపారు. వియత్నాంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని, మన అథ్లెట్లు గొప్ప పోరాట పటిమను చూపిస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో పోటీ పడబోయే మిగతా ఆటగాళ్లకు కూడా ఆయన శుభాకాంక్షలు అందించారు. ఇక రెండో రోజు కూడా భారత గ్రెకో-రోమన్ రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
55 కేజీల విభాగంలో నీరజ్, 63 కేజీల విభాగంలో సుమిత్, అలాగే 87 కేజీల విభాగంలో రోహిత్ బురా బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురూ క్వార్టర్ ఫైనల్ చేరి భారత్ జోరును ఇలాగే కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

