Mobile Popup Ad
Mobile Popup Ad

ముగిసిన తొలి రోజు ఆట.. అఫ్ఘాన్‌పై గిల్ గర్జన, భారత్‌దే పూర్తి ఆధిపత్యం

కలం, వెబ్ డెస్క్: భారత్, అప్ఘనిస్థాన్‌ టెస్ట్ మ్యాచ్ (India Afghanistan Test)  తొలిరోజు ముగిసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. అప్ఘాన్ బౌలర్లను ఊచకోత కోశారు. కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిస్తే.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. దీంతో తొలిరోజు ఆట పూర్తిగా ఆతిథ్య జట్టు ఆధీనంలో సాగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసి బలమైన స్థితిలో నిలిచింది. గిల్ 103 పరుగులతో, రిషభ్ పంత్ 50 పరుగులతో క్రీజులో ఉండటంతో రెండో రోజు భారీ స్కోరు దిశగా భారత్ అడుగులు వేస్తోంది.

టాస్‌ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు యశస్వి జైస్వాల్ దూకుడైన ఆరంభం అందించాడు. కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన అతడు జట్టు స్కోరు 41 వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్ జోడీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. అఫ్గాన్ బౌలర్లను క్రమంగా అలసటకు గురి చేస్తూ ఇద్దరూ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనుభవజ్ఞుడిలా ఆడిన కెఎల్ రాహుల్ శతకంతో ఆకట్టుకున్నాడు. 165 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు బాదిన రాహుల్ 100 పరుగులు చేసి జట్టు స్కోరును పటిష్ట స్థితికి చేర్చాడు.

మరోవైపు సాయి సుదర్శన్ కూడా తన ప్రతిభను చాటుతూ 104 బంతుల్లో 81 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 బౌండరీలు ఉండటం విశేషం. ఇద్దరూ ఔటయ్యే సమయానికి భారత్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. మధ్యాహ్నం తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్ తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. ప్రారంభంలో ఓపికగా ఆడిన అతడు, బంతి పాతబడిన తర్వాత షాట్‌ల ఎంపికలో దూకుడు పెంచాడు. 143 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 103 పరుగులు నమోదు చేశాడు.

కెప్టెన్‌గా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ ప్రత్యర్థి బౌలింగ్ దాడిని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. గిల్‌కు తోడుగా రిషభ్ పంత్ తన సహజ శైలిలో ఆడాడు. అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడు 70 బంతుల్లో 50 పరుగులు చేసి అర్ధశతకం పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండటంతో చివరి సెషన్‌లో భారత్ పరుగుల వేగం పెరిగింది. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ అజేయ భాగస్వామ్యంతో ఆఫ్ఘనిస్తాన్ మరింత ఒత్తిడి పెంచారు.

బౌలింగ్‌లో అప్ఘానిస్థాన్‌ తరఫున మొహమ్మద్ సలీమ్ మాత్రమే కొంత ప్రభావం చూపించాడు. అతడు రెండు వికెట్లు పడగొట్టగా, జియౌర్ రెహ్మాన్ ఒక వికెట్ సాధించాడు. అయితే మిగతా బౌలర్లు భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. అజ్మతుల్లా ఒమర్జాయ్, హష్మతుల్లా షాహిది ఆర్థికంగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ల రూపంలో విజయాన్ని అందుకోలేకపోయారు. అఫ్గానిస్థాన్ మాత్రం మ్యాచ్‌లోకి తిరిగి రావాలంటే ఉదయం సెషన్‌లోనే త్వరితగతిన వికెట్లు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>