కలం, వెబ్ డెస్క్: ఆసియా బాక్సింగ్లో భారత్ దుమ్మురేపింది. భారత బాక్సర్లు ప్రతర్థులను పవర్పుల్ పంచ్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా అండర్-15, అండర్-17 బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత్ యువ బాక్సర్ల హవా కొనసాగింది. అండర్-15 విభాగంలో ఏకంగా 30లో 27 పతకాలు భారత్ ఖాయం చేసుకుంది. భారత్ బాలికల జట్టు అద్భుతంగా రాణించింది. 15లో 14 పతకాలు సొంతం చేసుకుని సత్తా చాటింది. బాలుర జట్టు కూడా తగ్గేదేలే అన్నట్టు 15లో 13 పతకాలు ఖాయం చేసింది. తాజా పోటీల్లో భారత బాక్సర్ల దూకుడు మరింత కనిపించింది.
37 కేజీల్లో శాస్తా వసంత్ అశోక్ కుమార్, 49 కేజీల్లో పర్షాంత్ తొలి రౌండ్లోనే ఆర్ఎస్సీ విజయాలు సాధించారు. నితిన్, హర్షవర్ధన్ జీనా కూడా రెండో రౌండ్లోనే ప్రత్యర్థులను ఓడించారు. ఇక ఉత్కంఠభరిత బౌట్లలో యష్ కుమార్, రోహిత్ పోతినా 4-1 స్ప్లిట్ డెసిషన్తో విజయాలు అందుకున్నారు. సమీర్ బోహ్రా, నోంగ్పోక్న్గాన్బా మెయిటీ ఓయినా, మొహమ్మద్ యాసర్ 5-0 ఏకగ్రీవ విజయాలతో భారత్ ఆధిపత్యాన్ని మరింత బలపరిచారు. ఇప్పటికే 27 పతకాలు ఖాయం కావడంతో ఆసియా జూనియర్ బాక్సింగ్లో భారత్ బలమైన ముద్ర వేసింది. టోర్నీలో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతోంది.

