కలం, స్పోర్ట్స : మహిళల ప్రపంచకప్(Women World Cup 2026) లో భారత్ అదరగొడుతోంది. బుధవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ తన ఆధిపత్యాన్ని కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో తన సత్తా చాటింది. బ్యాటింగ్లో స్మృతి మందానా, షఫాలీ వర్మ పరుగుల సునామీ సృష్టించారు. బౌలింగ్లో నందినీ శర్మ, శ్రీచరని ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. దీంతో నెదర్లాండ్స్పై భారత్ 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో ఓపెనర్లు స్మృతి మందానా, షఫాలీ వర్మ మొదటి వికెట్కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి గట్టి పునాది వేశారు. షఫాలీ వర్మ 38 బంతుల్లో 10 ఫోర్లతో 55 పరుగులు చేసి హెచ్డీజే సీగర్స్ బౌలింగ్లో అవుటైంది. మరోవైపు ఆకాశమే హద్దుగా చెలరేగిన స్మృతి మందానా 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 74 పరుగులు సాధించి డీ లంగే బౌలింగ్లో వెనుదిరిగింది. జమీమా రోడ్రిక్స్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేయగా, యాస్తికా భాటియా 3 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో రిచా ఘోష్ కేవలం 8 బంతుల్లోనే 2 సిక్సర్లు, ఒక ఫోర్తో 20 పరుగులు, దీప్తి శర్మ 2 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 10 పరుగులతో నాటౌట్గా నిలిచి స్కోరును 200 దాటించారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 12 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డీ లంగే 2 వికెట్లు తీయగా, ఐరిస్ జ్విలింగ్, హెదర్ సీగర్స్, మైర్తే వాన్ డెన్ రాడ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ బ్యాటర్లు భారత బౌలింగ్ ధాటికి తలవంచారు. ఆ జట్టులో కెప్టెన్ బాబెట్ డి లీడ్ 28 పరుగులు, హెదర్ సీగర్స్ 21 పరుగులు, స్టెర్రే కాలిస్ 18 పరుగులు, ఫీబే మోల్కెన్బోయర్ 15 పరుగులు మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. రోబిన్ రిజ్కే 8 పరుగులు, ఫ్రెడరిక్ ఓవర్డిజ్క్ 9 పరుగులు, ఐరిస్ జ్విలింగ్ 8 పరుగులు చేయగా, సిల్వర్ సీగర్స్ ఒక పరుగు మాత్రమే చేసింది. మైర్తే వాన్ డెన్ రాడ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్ డకౌట్ అవ్వగా, కరోలిన్ డీ లంగే సున్నా పరుగులతో నాటౌట్గా నిలిచింది. భారత బౌలర్లలో శ్రీచరని అద్భుత స్పెల్తో 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి నడుము విరిచింది. బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోనూ మెరిసిన షఫాలీ వర్మ 3 వికెట్లు సాధించగా, నందినీ శర్మ 2 వికెట్లు, దీప్తి శర్మ ఒక వికెట్ తీసి జట్టు విజయానికి సహకరించారు. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత్ పటిష్టమైన ఆటతీరుతో ఈ ప్రపంచకప్లో ముందంజ వేసింది.

