కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 26వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేదిక నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ‘రైతు భరోసా’ (Rythu Bharosa) పెట్టుబడి సాయం నిధుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రైతు భరోసా నిధుల విడుదలపై రేపు (గురువారం) కొద్ది మంది మంత్రులతో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీ అనంతరం సీఎం ఖమ్మం పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో చింతకానిలో నిర్వహించే ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే సన్నద్ధమవుతున్నాయి. ఈ పర్యటన ద్వారా అటు ఖమ్మం జిల్లా అభివృద్ధి పనులకు ఊపు రావడంతో పాటు, ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి పెట్టుబడి సాయం అందనుంది.

