కలం, వెబ్ డెస్క్ : చక్కెర ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చక్కెర ఎగుమతుల (sugar export)పై తక్షణమే నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉంటాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ స్పష్టం చేసింది. ఎగుమతి విధానాన్ని నియంత్రిత విభాగం నుండి నిషేధిత విభాగానికి మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహాయింపులు ఇచ్చారు. ఐరోపా సమాఖ్య, అమెరికా దేశాలకు కోటా కింద జరిగే ఎగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవు. ఇతర దేశాల ఆహార భద్రత అవసరాల కోసం ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందాలకు అనుమతి ఉంటుంది. అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద జరిగే రవాణాకు ఆటంకం కలగదు. ప్రస్తుతం ఎగుమతి ప్రక్రియలో ఉన్న సరుకులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

