కలం/ఖమ్మం బ్యూరో : హైద్రాబాద్ సమీపంలో గల మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న రెండు జాగిలాలను భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాకు పోలీస్ శాఖ కేటాయించింది. ఎనిమిది నెలల పాటు పోలీస్ విధులకు సంబంధించిన అంశాలపై ఈ డాగ్స్ శిక్షణ పొందాయి. వీటికి షైనీ, లైకాలుగా నామకరణం చేశారు. వీటితో కలిపి కొత్తగూడెం జిల్లాలో 14 పోలీస్ డాగ్స్ ఉన్నాయి. పేలుడు పదార్థాలు కనుగొనడంలో లైకా, షైనీలు ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందినట్లు వాటి హ్యాండ్లర్స్ ముత్తయ్య, లాల్ సింగ్ లు తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంటుంది. తెలంగాణలోని అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా కూడా ఇదే. తెలంగాణలోనీ కొత్తగూడెం (Kothagudem) జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంతో పాటు గంజాయి అక్రమ రవాణా కూడా అధికంగానే ఉంటుంది. ఇవే కాకుండా ఇతర నేరస్థులను కూడా పట్టుకోవడంలో ఈ పోలీస్ జాగిలాలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohit Raj) పోలీస్ జాగిలాలతో కాసేపు సరదాగా గడిపారు. పోలీస్ జాగిలాలకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారో తెలుసుకున్నారు. ఇతర డాగ్ స్క్వాడ్ అధికారులకు డాగ్స్ భద్రతపై పలు సూచనలు చేశారు.
Read Also: ‘సర్’కు సిద్ధంగా ఉండండి.. తెలుగు రాష్ట్రాలకు ఈసీ ఆదేశం
Follow Us On: Instagram


