కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) మ్యాచ్లు మొదలవుతున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. భారత్లో ఆడేందుకు నిరాకరిస్తూ బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుండి తప్పుకోగా, పాకిస్థాన్ కూడా అదే బాట పట్టడం సంచలనంగా మారింది. ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన కీలకమైన మ్యాచ్ను ఆడే ప్రసక్తే లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్కు సంఘీభావంగా పాక్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గట్టి చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే మీడియా హక్కులు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయానికి భారీ గండి పడుతుంది. ఈ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి పాకిస్థాన్కు అందాల్సిన పూర్తి నిధుల ప్యాకేజీని నిలిపివేయాలని ఐసీసీ యోచిస్తోంది. సాధారణంగా ఈ టోర్నీ ద్వారా పాక్కు లభించాల్సిన దాదాపు రూ. 300 కోట్ల ఆదాయాన్ని నిలిపివేయాలనే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే జరిగితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. ఇప్పటికే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చిన ఐసీసీ (ICC) నిబంధనల విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని పరోక్షంగా హెచ్చరించింది. కేవలం ఒక్క మ్యాచ్ను బహిష్కరించాలనే నిర్ణయం వల్ల వందల కోట్ల ఆదాయంతోపాటు, అంతర్జాతీయంగా పాక్ తన పరువును కోల్పోవడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also: పాక్ జట్టుకు అసలు బలం అదే: అశ్విన్
Follow Us On : WhatsApp


