కలం, వెబ్ డెస్క్: హైడ్రా (HYDRA) సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మూసీలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను సురక్షితంగా రక్షించారు. అంబర్పేట (Amberpet) గోల్నాక పరిధిలోని భాగ్యనగర్ నివాసి ఇందిర (49) శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు మూసీలో పడింది. ఒడ్డుకు వచ్చే అవకాశం లేని చోట, చెట్ల పొదల మధ్య చిక్కుకుపోవడంతో ఆమె రాత్రంతా నదిలోనే భయం భయంగా గడిపింది. శనివారం ఉదయం 10 గంటల తర్వాత ఆమెను స్థానికులు గుర్తించారు. బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో వెంటనే హైడ్రా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు.
సమాచారం అందిన కేవలం 16 నిమిషాల్లోనే డీఆర్ఎఫ్ (DRF) రెస్క్యూ ఇన్చార్జి స్వామి నేతృత్వంలోని బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. హైడ్రా సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి, పెద్ద నిచ్చెనల సహాయంతో నదిలోకి దిగారు. ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న ఇందిరను చాకచక్యంగా బయటకు తీసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

