కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పాటిఘనాపూర్ గ్రామ పరిధిలోని ఆనందనగర్ లేఔట్లో జరిగిన భూకబ్జాలపై హైడ్రా (HYDRA) అధికారులు ఉక్కుపాదం మోపారు. 1980లో సుమారు 92 ఎకరాల్లో 1109 ప్లాట్లతో వెలిసిన ఈ లేఔట్లో పార్కులు, రహదారులు, బహిరంగ అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. లేఔట్ హద్దులను చెరిపివేసి, ఆ భూములను వ్యవసాయ క్షేత్రాలుగా ధరణిలో నమోదు చేయించి పాస్బుక్కులు సృష్టించారని బాధితులు నిన్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
బాధితుల వినతిపై హైడ్రా (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ తక్షణమే స్పందించారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించిన ఆయన, లేఔట్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది సహాయంతో సర్వే నంబర్లు 185 నుండి 187, 243 నుండి 250 వరకు ఉన్న ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. లేఔట్లోని రోడ్లు, పార్కులను యథావిధిగా పునరుద్ధరించడమే కాకుండా, కబ్జాకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

