కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చేందుకు సిద్ధమైంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా, ఎంఎంటీఎస్ (Hyderabad MMTS) రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ వినూత్న నిర్ణయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పచ్చజెండా ఊపారు. ఎంఎంటీఎస్లో ప్రయాణికులకు ఉచిత సదుపాయం కల్పించడం వల్ల రైల్వే శాఖకు కలిగే ఆదాయ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. దీనికి సంబంధించి అధికారిక అనుమతులు కోరుతూ ఇప్పటికే రైల్వే బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
ప్రయాణికులు స్టేషన్లకు చేరుకోవడంలో ఇబ్బంది కలగకుండా ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ షటిల్ బస్సులను నడపాలని కూడా సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం అందుబాటులోకి వస్తే మధ్యతరగతి, సామాన్య ప్రజలకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, రోడ్లపై వాహనాల ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

