కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) పట్టణ శివారు ప్రాంతాల్లో ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు శనివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి, నాటుసారా పట్టుబడ్డాయి. ఈ దాడిలో మొత్తం 21.1 కిలోల గంజాయితో పాటు 30 లీటర్ల నాటుసారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ సొత్తు మొత్తం విలువ దాదాపు రూ. 12 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఆబ్కారీ ఎస్సై శ్రీహరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారులో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 21.1 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులను మహారాష్ట్రకు చెందిన షేక్ అజార్ షకీల్, అంకుష్ వినాయక్ పవార్లుగా గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. వీరు ఆంధ్రప్రదేశ్ లో గంజాయిని కొనుగోలు చేసి, భద్రాచలం మీదుగా మహారాష్ట్రలోని తుల్జానగర్కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
అదే సమయంలో స్థానిక అంబేడ్కర్ సెంటర్లో చేపట్టిన మరో వాహన తనిఖీలో.. ద్విచక్రవాహనంపై సంచిలో రెండు క్యాన్లలో దాచి తరలిస్తున్న 30 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

