కలం, కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికి జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో 9 రోజులపాటు ప్రచార జాతా (CPI Prachara Jatha) ను నిర్వహిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ప్రచార జాతాకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సీపీఐ నాయకులతో కలిసి పంజాల శ్రీనివాస్ ఆవిష్కరించారు.
గురువారం నుండి కరీంనగర్ లోని పద్మనగర్ లో జరిగే ప్రచార జాతాను ప్రారంభించడానికి సీపీఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం దేశ ప్రజలకు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హామీల ఊసే లేకుండా పరిపాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు.
దేశంలో సుపరిపాలన అందిస్తామని ప్రజలను నమ్మించి అధికారంలో కొనసాగుతుందని, అచ్చే దిన్ ఆగయా అంటూనే ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పెనుభారం మోపడం వల్ల ప్రజలు సచ్చేదిన్ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, విద్యా, వైద్య సదుపాయం పేదలకు అందడం లేదని, రైతుల కష్టాలు కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కులను కాల రాస్తుందని, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారని ఇలా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నేటి నుండి 14వ తేదీ వరకు 9 రోజుల పాటు సీపీఐ ప్రచార జాతా జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు.
ఈ వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, చొక్కల శ్రీశైలం, బండ రాజిరెడ్డి, గోవిందుల రవి, లంకదాసరి కల్యాణ్, మౌలానా తదితరులు ఉన్నారు.

