కలం, వెబ్ డెస్క్: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధ్యానం (Meditation) శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ధ్యానం ద్వారా కేవలం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా అనుబంధాలను కూడా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు రిలేషన్షిప్ నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. గొడవలు జరగడానికి ముఖ్య కారణం ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం. ఎదుటి వారు ఏమైనా అన్నప్పుడు కఠినంగా మాట్లాడేయడం. దీని వల్ల గొడవలు పెరుగుతాయే తప్ప ప్రయోజనం ఉండదు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది. భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డప్పుడూ ఎవరో ఒకరు ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం. అయితే ధ్యానం చేయడం ద్వారా గొడవలు తగ్గి అనుబంధాలు ధృడం అవుతాయని చెబుతున్నారు నిపుణులు.
ధ్యానం చేయడం ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచనలు కూడా పాజిటివ్ గా ఉంటాయి. అంటే ధ్యానం పాజిటివ్ ఆలోచనలను రేకెత్తిస్తుంది. పాజిటివ్ ఆలోచన ఎదుటి వ్యక్తిని సానుకూల దృక్పథంతో చూసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా వారితో సులభంగా కలిసిపోగలుగుతాం. మన మనసులోని బాధలు, సమస్యలు వారితో పంచుకోగలుగుతాం. దీనివల్ల గొడవలు తగ్గి బంధం బలపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
ధ్యానం అనేది మనిషిలో క్షమాగుణాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. అవతలి వారు తప్పు చేసినప్పుడు కూడా సానుకూలంగా ఆలోచించి క్షమించగలిగే అలవాటు ధ్యానం ద్వారా కలుగుతుందని చెబుతున్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరు ఇలా ఉన్న బంధం సాఫీగా ముందుకు సాగుతుంది. అందుకే భార్యాభర్తలిద్దరూ కలిసి ధ్యానం చేసినా, విడివిడిగా ధ్యానం చేసినా ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని దృడం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

