కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండలోని శాసనసభ పక్ష నేత సిరికొండ మధుసూదనా చారిని పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. తొర్రూర్ మున్సిపల్ (Thorrur Municipality) చైర్మన్ ఎన్నికకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. హన్మకొండ లోని టీవీ టవర్ మధుసూదన చారి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే, జిల్లాలోని పర్వతగిరి నుండి తొర్రూర్ మున్సిపాలిటీ (Thorrur Municipality) కి వెళ్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ల బస్సును పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.
అన్నారం వద్ద బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్ బస్సు దిగాలంటూ పోలీసులు ఆదేశించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డిని తొర్రూరుకు రావడానికి అనుమతించి, తమనెందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులను దాటుకుని బస్సును తొర్రూరు వైపు తరలించారు.
మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవితను తొర్రూరు పట్టణంలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు వాహనాన్ని నిలిపివేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపధ్యంలో అనుమతి లేదని పోలీసులు చెప్పారు. మరోవైపు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశశ్వినీ రెడ్డి తొర్రూర్ మున్సిపాలిటీకి చేరుకున్నారు.


