కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈసీ కార్యాలయానికి చేరుకుంది. సెక్యూరిటీ వారిని లోపలికి అనుమతించకపోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సెక్యూరిటీ గేట్లకు తాళాలు వేయడంతో కాంగ్రెస్ నేతలు సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జైరాం రమేష్, సచిన్ పైలట్, కేసీ వేణు గోపాల్, భూపేశ్ భగేల్ తదితరులు ఈసీ కార్యాలయం గేటు బయట కూర్చొని నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ తమను లోపలికి అనుమతించే వరకు ఇక్కడే కూర్చుంటామని స్పష్టం చేశారు. తామంతా బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులని, వారిలో మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ.. తమ అభ్యర్థి మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్లు గానీ, చార్జ్షీట్లు గానీ లేవన్నారు. సరైన కారణం లేకుండానే ఆమె నామినేషన్ను తిరస్కరించారని మండిపడ్డారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే లోపలికి అనుమతించడం లేదన్నారు. రెండు గంటల ముందే తాము లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చామని, తాము గెలవబోతున్న స్థానంలో తమ అభ్యర్థి నామినేషన్ను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్లో అధికారులు లేరని చెబుతున్నారని, కేవలం ఒక నోటీసు ఆధారంగా రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ను రద్దు చేయడం ఇదే తొలిసారి అని ఆయన వెల్లడించారు.
మరోవైపు తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఈ వ్యవహారంతో బీజేపీ రాజనీతి ఏంటో అందరికి అర్థమైందని, దేశంలో ఏక పార్టీ వ్యవస్థను తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని విమర్శించారు. సర్ ప్రక్రియతో ఓట్ చోరీ చేశారని, ఇప్పుడు రాజ్య సభ సీటును చోరీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈసీ కార్యాలయం సెక్యూరిటీ కాంగ్రెస్ నేతలు ఉదయం రావాలని, ఇప్పుడు లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

