కలం, డెస్క్ : నటుడు మోహన్ బాబుకు (Mohan Babu) హైకోర్టులో షాక్ తగిలింది. విద్యార్థి లీడర్ల కిడ్నాప్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మోహన్ బాబు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విద్యార్థుల ఫోన్ కాల్స్, మెసేజ్ లను ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలించి నివేదిక అందజేసే వరకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్ పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఎఫ్ ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు మోహన్ బాబు (Mohan Babu) వేసిన అనుబంధ పిటిషన్ ను ఇప్పటికే హైకోర్టు కొట్టేసింది.
అసలేం జరిగింది..?
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ జరుగుతోందని ఎస్ ఎఫ్ఐ లీడర్లు వినోద్, అక్బర్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి గత నెలలో వెళ్లారు. స్టూడెంట్లు అలా వెళ్తున్న టైమ్ లో మంచు విష్ణు, మోహన్ బాబుకు చెందిన బౌన్సర్లు కిడ్నాప్ చేశారంటూ కేసు నమోదైంది. కిడ్నాపర్ల చెర నుంచి విద్యార్థి లీడర్లను విడిపించారు పోలీసులు. ఈ కేసులో మంచు విష్ణు ఏ2గా, మోహన్ బాబు ఏ3గా ఉన్నారు.


