కలం, వెబ్డెస్క్: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిఒక్కరూ ఇష్టపడే పండ్లలో అరటి పండు (Banana) ను ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అరటి పండులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్ B6, విటమిన్ C, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అరటిపండు అత్యంత ఆరోగ్యకరమైన పోషకాల గని అయినప్పటికీ, అందరి శరీర తత్వాలకు ఇది ఒకేలా సరిపోదని చెబుతున్నారు నిపుణులు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అరటిపండును మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
1. ఊబకాయం/అధిక బరువు ఉన్నవారు
అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు అరటిపండును పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే అరటిపండులో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయట. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు, ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతే కాకుండా రాత్రివేళ అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకునే అవకాశం పెరుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలని భావించే వారు రోజుకు ఒక అరటిపండుకే పరిమితం కావడం మంచిది.
2. మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు
అరటిపండులో పొటాషియం అనే ఖనిజం అధికంగా ఉంటుందని మనందరికి తెలుసు. సాధారణంగా ఆరోగ్య కరమైన కిడ్నీలు ఈ ఖనిజాన్ని బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో పొటాషియం శరీరంలో పేరుకుపోయి గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందట. అందువల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, అరటిపండ్లు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
3. సైనస్ లేదా ఆస్తమా ఉన్నవారు
జలుబు, దగ్గు, కఫం, సైనస్ లేదా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను ఎక్కువగా తీసుకోకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరంలో కఫాన్ని పెంచుతుందట. దీంతో ఇప్పటికే ఉన్న దగ్గు, జలుబు మరింత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో అరటిపండ్లు తినడం వల్ల గొంతులో కఫం చేరి అసౌకర్యం కలిగించవచ్చని చెబుతున్నారు నిపుణులు.
4. షుగర్ వ్యాధి ఉన్నవారు
మధుమేహం/షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా అరటిపండ్లు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బాగా పండిన అరటిపండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే డాక్టర్ సూచన మేరకు పరిమిత మోతాదులో అరటిపండును తీసుకోవడం మంచిదట.
5. అలర్జీ ఉన్నవారు
వీరితో పాటు కొంతమందికి అరటిపండ్ల పట్ల అలెర్జీ కూడా ఉండవచ్చు. అరటిపండు తిన్న వెంటనే దురద, చర్మంపై ఎర్రటి మచ్చలు, వాపు, వికారం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఎలర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండును తినకపోవటమే మంచిదట.
అంతేకాకుండా అరటిపండును సరైన సమయంలో తినడం కూడా చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నిపుణులు. ఉదయం టిఫిన్ తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో అరటిపండును తినడం మంచిదట. ఖాళీ కడుపుతో తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తీసుకోవడం మంచిదట. ఆరోగ్య పరిస్థితిని బట్టి మితంగా తీసుకుంటే అరటిపండు నిజంగా శరీరానికి మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

