కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుమారు రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ తెలంగాణ ఆయిల్ఫెడ్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు.
బహిరంగ లేఖలో ప్రస్తావించిన అంశాలివే..
- కాంగ్రెస్ ప్రభుత్వం నగరం నడిబొడ్డులో మరో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోంది.
- రేవంత్ రెడ్డి సర్కార్.. రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది.
- ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అజామాబాద్లో ఉన్న రూ.500 కోట్ల విలువైన ఆయిల్ఫెడ్ భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం
- బహిరంగ మార్కెట్లో 500 కోట్ల రూపాయలు పలికే భూమిని.. కేవలం 87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర.
- ఆ 87 కోట్లు చెల్లించడానికి సొంత ప్రభుత్వ సంస్థ ఆయిల్ఫెడ్ సిద్ధంగా ఉన్నా.. ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడం వెనుక ఉన్న కుంభకోణం ఏంటి?
- మూడు దశాబ్దాలుగా ఆయిల్ఫెడ్ ఆధీనంలో ఉన్న 3 ఎకరాల 23 గుంటల భూమిని లాక్కునే దుర్మార్గం.
- 1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు మొట్టికాయలు వేసి ప్రభుత్వానిదే హక్కు అని తేల్చినా.. కమీషన్ల కోసం కాంగ్రెస్ నేతలు తీర్పులనే తుంగలో తొక్కారు.
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడాం.
- ఇది ఒక్క అజామాబాద్ భూమి కథే కాదు.. కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలిలోనూ కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందానే నడుస్తోంది.
ఇలా స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా ఆస్తులు అమ్ముకుంటూ పోతే.. భవిష్యత్తులో గుడికి, బడికి, చివరికి స్మశానానికి కూడా రాష్ట్రంలో స్థలం మిగలదు.
తక్షణమే ముఖ్యమంత్రి ఈ అక్రమ కేటాయింపును రద్దు చేసి, ఆ భూమిని ఆయిల్ఫెడ్కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలి. - ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.. ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మహా పోరాటం చేస్తాం.

