కలం, నిర్మల్: ఖేలో ఇండియాలో భాగంగా భైంసా (Bhainsa) వేదికగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సండేస్ ఆన్ సైకిల్స్ కార్యక్రమం జరిగింది. ప్రజల్లో శారీరక దారుఢ్యం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం పెంచడమే లక్ష్యంగా ఈ సైక్లింగ్, నడక కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
క్రీడలు, వ్యాయామం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్, నడకను రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని కోరారు. ఫిట్ ఇండియా, హిట్ ఇండియా, ఆరోగ్య భారత్, సమృద్ధి భారత్ నినాదాలతో సాగిన ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

