కలం, కరీంనగర్ బ్యూరో : కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరాన్ని నిర్మించి నీళ్లు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం నీటి కష్టాలను చూస్తున్నాం అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన కరీంనగర్ బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్తో పార్టీకి ఉన్న అనుబంధాన్ని హరీశ్రావు గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని.. కేసీఆర్ ఎంపీ పదవికి రెండుసార్లు రాజీనామా చేసి గెలుపొందిన గడ్డ ఇది అని వెల్లడించారు.
ఇలాంటి చోట కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని ఆయన ధ్వజమెత్తారు. మేడిగడ్డ నుండి నీటిని తరలించే అవకాశం ఉన్నా, రేవంత్ ప్రభుత్వం బురద రాజకీయాల కోసం నీటిని నిలిపివేసిందన్నారు. రైతులకు ఏమీ చేయని రేవంత్ రెడ్డి.. కేసీఆర్పై నోరు పారేసుకోవడం సరికాదు అని ఆయన హెచ్చరించారు. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై హరీశ్రావు కీలక సూచనలు చేశారు. పశ్చిమ బెంగాల్ ఉదంతాలను ఉదహరిస్తూ, నిర్లక్ష్యం వహిస్తే ఓటు హక్కునే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కేసులకు భయపడను : గంగుల కమలాకర్
కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. పట్టపగలు తన క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు కానీ.. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రత్తిష్టించిన తమపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గంగుల స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సర్దార్ రవీందర్ సింగ్, చల్ల హరిశంకర్, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

