కలం, వెబ్ డెస్క్ : రాజకీయాల్లో విమర్శలకు ఒక హద్దు పద్దు ఉండాలని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. తనపై కాంగ్రెస్ నేతలు చేసిన క్షుద్రపూజల కామెంట్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. బట్ట కాల్చి మీద వేసే యత్నాలు చేస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
ప్రభుత్వం చేస్తున్న స్కాములను వరుసగా బయటపెడుతున్నాననే ఉద్దేశంతోనే తనను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కొండా సురేఖ అడ్డగోలుగా మాట్లాడి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇప్పుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో కూడా క్రిమినల్ సూట్, డిఫమేషన్ సూట్ వేయబోతున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడితే చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

