కలం, మెదక్ బ్యూరో: అంతరించిపోతున్న తెలంగాణ ఆటలను వెలికి తీసి నేటి తరానికి అందించాలనే ఉద్దేశంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో చిర్ర గోనె ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఈ టోర్నమెంట్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు చిర్ర గోనె, కోకో, వాలీబాల్ లాంటి ఆటలు ఆడేవాళ్లమని గుర్తు చేశారు. శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉండేవన్నారు.
బయట ఆటలు ఆడేటప్పుడు సూర్య రష్మి తాకుతుందని, తద్వారా ఎన్నో లాభాలున్నాయని చెప్పారు. కానీ, నేటి తరం అన్ని ఆటలు ఫోన్, ఆన్లైన్లోనే ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చిన్నప్పటి నుండే రకరకాల వ్యాధుల బారిన పడుతున్నట్లు వివరించారు. ఈ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరుగున పడిన ఇలాంటి ఆటలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు.

