కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రెస్ క్లబ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్ – బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టం అమలు, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగెం సూర్యారావు మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు చదువుకొని భవిష్యత్తులో ముందుకు పోయే విధంగా కృషి చేయాలని కోరారు. సమాజంలో 90 శాతం ఉన్న అణగారిన వర్గాల పక్షాలు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు పోయే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పు రావాలని విద్యార్థులు మేలుకున్నప్పుడే తమ హక్కులు సాధించుకోవచ్చు అన్నారు.
అన్ని కులాలను ఏకం చేయాలి..
బీసీలలోని అన్ని కులాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించుకోవాలని.. అప్పుడే వ్యవస్థలో తమకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చని సూర్యారావు సూచించారు. బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసుకొని మండలాల వారిగా గ్రామాల వారిగా పోరాడుతామని చెప్పారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్కూల్లో 25 శాతం సీట్లు ఇచ్చే విధంగా అవగాహన కల్పించి వారి పక్షాన నిలుస్తామన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ విషయంలో పాత పద్ధతిని అవలంబించాలని.. కొత్త జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని పూర్తిగా నీరు కార్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఉద్యమ రూపంలో ముందుకు వెళ్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ అధ్యక్షుడు శివార్చక విజయ్ కుమార్, బీసీ జేఏసీ అధ్యక్షుడు బెక్కెం జనార్ధన్, కుమ్మరి సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు బుగ్గన్న, బీసీ జేఏసీ నాయకులు సారంగి లక్ష్మీకాంత్, నాయి బ్రాహ్మణ సంఘ పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మున్నూరు జైపాల్, బహుజన టీచర్స్ నాయకులు చెన్నయ్య, కృష్ణయ్య, విద్యార్థి సంఘాల నాయకులు భరత్, నరసింహ బీసీ సంఘాల నాయకులు జుర్రు నారాయణ యాదవ్, మల్లయ్య, సర్పంచ్ ఈశ్వర్, వెంకటస్వామి, సత్యశిల సాగర్, రాజేంద్ర గౌడ్ బీసీ సమాజ్ నాయకులు నరసింహ, రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

