కలం, వెబ్డెస్క్: బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (BJP-Shiromani Akali Dal) మధ్య మళ్లీ పొత్తు పొడవనుంది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నది. శుక్రవారం పార్లమెంట్లో ప్రధాని మోదీతో అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ సమావేశమవడం, కేంద్రం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు శనివారం మద్దతు ప్రకటించడంతో ఆరేండ్ల తర్వాత మళ్లీ ఎన్డీయే గూటికి అకాలీదళ్ చేరునున్నదనే చర్చ జోరందుకున్నది.
నాడు వ్యతిరేకించి..
ఈ ఏడాది ఏప్రిల్లో డీలిమిటేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తొలిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అకాలీదళ్ వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు తన స్టాండ్ మార్చుకున్నది. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘ఈ రోజు చండీగఢ్లో శిరోమణి అకాలీదళ్ సీనియర్ లీడర్ల మీటింగ్ జరిగింది. మహిళా రిజర్వేషన్లు సహా డీలిమిటేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించాం. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం చొప్పున సీట్లు పెంచాలని కేంద్రం తెచ్చిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం” అని పేర్కొన్నారు.
2020లో ఎన్డీయే నుంచి బయటకు..
= బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య రెండున్నర దశాబ్దాల బంధం ఉన్నది. అయితే 2020 కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి అకాలీదళ్ బయటకు వచ్చింది.
= ఆ తర్వాత 2022 పంజాబ్ అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అకాలీదళ్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.
= పంజాబ్లో ఆప్, కాంగ్రెస్ను ఎదుర్కోవాలంటే బీజేపీతో మళ్లీ కలవాలని అకాలీదళ్ నిర్ణయించినట్టు సమాచారం. అందులో భాగంగానే ప్రధాని మోదీతో సుఖ్బీర్ సింగ్ బాదల్ సమావేశమైనట్టు తెలుస్తున్నది.
= రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని అటు బీజేపీ, ఇటు అకాలీదళ్ సహా ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా పేర్కొన్నాయి.

