కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పరువుని సీఎం, మంత్రులు గంగలో కలుపుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి సుందిళ్ళ బ్యారేజ్కి నీళ్లు తెస్తాం అని ఉత్తమ్ కుమార్ చెబుతుంటే, సీఎం ఏమో ఎల్లంపల్లి దగ్గరికి నీళ్లు తెస్తామని అంటున్నారని అన్నారు. మంత్రి జూపల్లి ఏమో లిఫ్ట్ అవసరం లేదు అంటున్నాడని, అసలు ఎవరు చెప్పేది కరెక్ట్ అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నీటి ప్రాజెక్టులపై అస్పష్టతే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
రూ.84 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తవుతుందా..? అని ప్రశ్నించారు. మూడు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మీరు ఆనాడు ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేస్తామని తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని, కాంగ్రెస్ DNA లోనే అవినీతి ఉందని విమర్శించారు.

