కలం, వెబ్ డెస్క్: సీనియర్ కాంగ్రెస్ నేత, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు (Hanumantha Rao) తన మంచి మనసును చాటుకున్నారు. సలహాదారు పదవి ద్వారా తనకు అందే పూర్తి జీత భత్యాన్ని (Salary) పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చిస్తానని ప్రకటించారు. పదవిలో ఉన్నంత కాలం వచ్చే ప్రతి రూపాయిని ట్రస్టులకు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లో తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లేరని, కేవలం తన కష్టాన్ని నమ్ముకుని ఈ స్థాయికి ఎదిగానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలు మారే వ్యక్తిని కాదని, నిబద్ధతతో కాంగ్రెస్లోనే కొనసాగుతానని ఈ సందర్భంగా వీహెచ్ చెప్పారు.
రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన నినాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తానని హనుమంతరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. కులగణనలో ఓబీసీ అంశాలపై ఆయన కీలక హెచ్చరిక చేశారు. మే 10లోపు కులగణన ప్రక్రియలో ఓబీసీలను చేర్చని పక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వీహెచ్ అన్నారు.

