కలం, వరంగల్ బ్యూరో : హన్మకొండ (Hanumakonda) ఎన్జీఓస్ కాలనీలోని సుమంగలి ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతంలో అనుమతి లేకుండా ఇంటి ముందు ఉన్న చెట్ల కొమ్మలను తొలగించిన ఘటనను హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయి ఆగ్రహం వ్యక్తం చేసారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలోని చెట్ల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా చెట్లను నరికివేయడం లేదా కొమ్మలను తొలగించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు.
సంబంధిత వ్యక్తిపై వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జీడబ్ల్యూఎంసీ హార్టికల్చర్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో అనుమతి లేకుండా చెట్ల కొమ్మలను తొలగించిన వ్యక్తిపై చెట్టుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.30 వేల జరిమానా విధించినట్లు హార్టికల్చర్ అధికారి రమేశ్ తెలిపారు. ప్రజలు చెట్లను సంరక్షించాలని, చెట్ల తొలగింపులు లేదా కొమ్మల కత్తిరింపులకు సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

