కలం, వెబ్డెస్క్: స్పెయిన్ తీరానికి చేరుకున్న ఓ నౌకలో హంటా వైరస్ (Hanta Virus) వ్యాప్తి చెందినట్లు అనుమానాలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇందులో ఇద్దరు భారతీయులు ఉండటంతో ఇండియన్ ఎంబసీ (Indian Embassy) కీలక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నెదర్లాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ హోండియస్ నౌకలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఇద్దరు భారతీయులు క్రూ మెంబర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. నౌకలో హంటా వైరస్ వ్యాప్తి చెందినట్లు అనుమానాలు రావడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, స్పానిష్ అధికారుల నిబంధనల ప్రకారం కానరీ ఐలాండ్స్ సమీపంలో నౌకను నిలిపివేసి ప్రయాణికులను ఖాళీ చేయించారు.
ప్రస్తుతం ఆ ఇద్దరు భారతీయులు ఆరోగ్యంగా ఉన్నారని, వారికి వైరస్ లక్షణాలు ఏవీ లేవని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. స్పానిష్ నేషనల్ సెంటర్ ఫర్ ఎమర్జెన్సీ మానిటరింగ్ అండ్ కోఆర్డినేషన్ సమాచారం ప్రకారం, వారిని నెదర్లాండ్స్కు తరలించి అక్కడ ఆరోగ్య ప్రోటోకాల్స్ ప్రకారం క్వారంటైన్లో ఉంచనున్నారు. భారత రాయబారి నిరంతరం స్పానిష్ అధికారులతో, సదరు భారతీయులతో సంప్రదింపులు జరుపుతూ వారి భద్రతను, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

