కలం, వెబ్ డెస్క్ : ఏపీలో వడగండ్ల వాన (Hailstorm) బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. విజయవాడ, గుంటూరులో భారీగా వడగండ్ల వాన పడుతోంది. దీంతో వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. రానున్న 24 గంటల్లో మరిన్ని వడగండ్ల వానలు (Hailstorm) పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో విజయవాడ, భీమవరం, గన్నవరం, గుడివాడ, భీమడోలు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా వడగండ్ల వానపై పెద్ద ఎత్తున ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అసలే పంటలు చేతికొచ్చే సమయంలో ఈ వడగండ్ల వానలు పడితే.. తీవ్ర నష్టాలు తప్పవని అంటున్నారు రైతులు.

