కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ వేదికగా జరుగుతున్న గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో గుజరాత్ అదరగొట్టింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ నిరాశపరిచినా.. మిగిలిన బ్యాటర్లు మాత్రం మైదానంలో వీరవిహారం చేశారు. పరుగుల సునామీ సృష్టించారు. గుజరాత్ బ్యాటర్ల దెబ్బకు ఢిల్లీ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ ముందు 211 పరుగుల లక్ష్యం నిలిచింది. ఢిల్లీ బౌలర్లో ముఖేష్ కుమార్ వికెట్లు తీసినా పరుగులు భారీగా ఇచ్చుకున్నాడు.
పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటర్లు శివమెత్తారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన గుజరాత్కు ఆరంభంలోనే సాయి సుదర్శన్ (12) వికెట్ కోల్పోయి షాక్ తగిలినా, ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. గిల్ కేవలం 45 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 70 పరుగులు చేసి ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిస్తే, బట్లర్ తన స్టైల్లో 27 బంతుల్లోనే 5 సిక్సర్లు బాది 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ వెనుదిరిగిన తర్వాత కూడా ఢిల్లీ బౌలర్లకు ఉపశమనం లభించలేదు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 55 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరికి గ్లెన్ ఫిలిప్స్ (14*) ధాటిగా ఆడటంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో 55 పరుగులు సమర్పించుకోగా, కుల్దీప్ యాదవ్, లుంగి నిగిడి తలో వికెట్ పడగొట్టారు. ఢిల్లీ ఈ మ్యాచ్ గెలవాలంటే నిర్ణీత 120 బంతుల్లో 211 పరుగులు చేయాల్సి ఉంది.

