కలం, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాంను జీఆర్ఎంబీ (గోదావరి నది యాజమాన్య బోర్డు) చైర్మన్ పద్మా దొర్జే గ్యాంబా (GRMB Chairman Padma Dorje Gyamba) పరిశీలించారు. గురువారం ఉదయం హిల్కాలనీలోని విజయవిహార్ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు డ్యాం ఎస్ఈ మల్లికార్జునరావు, ఆంధ్ర ఎస్ఈ వెంకటరత్నం పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం విజయవిహార్ సమావేశ మందిరంలో తెలంగాణ, ఆంధ్ర నీటిపారుదల అధికారులతో పలు అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
అనంతరం డ్యాం స్పిల్ వే, క్రస్టుగేట్లు, నీటిమట్టం సూచించే ప్రాంతం, గ్యాలరీ, కంట్రోల్ రూమ్, కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలను దొర్జే గ్యాంబా పరిశీలించారు. అనంతరం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి ఆర్కియాలజీ మ్యూజియాన్ని సందర్శించారు. ఆయన వెంట జీఆర్ఎంబీ కార్యదర్శి అఖిలేశ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేణుగోపాల్, ఎన్నెస్సీ డీఈలు, ఏఈలు తదితరులున్నారు.

