కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) పరిధిలో ఉన్న షాహ్బేరి ఫర్నీచర్ మార్కెట్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఒక దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటలు పక్కనే ఉన్న ఇతర షాపులకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాద తీవ్రతకు మొత్తం ఆరు ఫర్నీచర్ దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.
స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

