కలం, నేషనల్ డెస్క్: కైలాస్ మానస సరోవర్ యాత్రకు (Kailash Mansarovar Yatra) అనుమతులు లేకుండా వెళ్లొద్దని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా వెళ్లే భారతీయులు తప్పనిసరిగా అవసరమైన ప్రయాణ పత్రాలు, చైనా ప్రవేశ అనుమతులు (ఎంట్రీ పర్మిట్లు), వీసాలు తీసుకోవాలని సూచించింది. లేకపోతే విదేశాల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తాము ఎంచుకున్న టూర్ ఆపరేటర్ ప్రభుత్వ అనుమతి పొందిన, అధికారికంగా నమోదైన సంస్థేనా అన్నది కూడా ముందుగానే ధ్రువీకరించుకోవాలని సూచించింది.
నేపాల్లో చిక్కుకున్న భారతీయులు..
ప్రస్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన సుమారు 52 మంది భారతీయులు నేపాల్ రాజధాని ఖాట్మాండులో చిక్కుకుపోయారు. అత్యవసర సహాయం కోరుతున్నారు. ఈ అంశాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, నేపాల్, చైనాలోని భారత రాయబార కార్యాలయాలు వెంటనే జోక్యం చేసుకుని చిక్కుకుపోయిన యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆమె ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు. దీంతో విదేశాంగశాఖ స్పందించింది.

