కలం, వెబ్ డెస్క్: మహావీర్ జయంతిని పురస్కరించుకుని మార్చి 31న హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా అన్ని పశువధశాలలు, గొర్రెలు, మేకల మాంసం విక్రయశాలలతో పాటు బీఫ్ దుకాణాలను మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆదేశించింది. జైన మతస్థుల పవిత్ర పండుగ సందర్భంగా మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ ప్రతి ఏటా ఈ నిర్ణయం తీసుకుంటారు.
ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మంగళవారం ఒక సర్క్యులర్ జారీ చేస్తూ, తన పరిధిలోని అధికారులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న మాంసం దుకాణదారులు ఈ నిబంధనను పాటించేలా చూడాలని ఆదేశించారు. మున్సిపల్ సిబ్బందికి తగిన సహకారం అందించాలని పోలీసు అధికారులను కోరారు.

