కలం, స్పోర్ట్స్ : శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్కు టీమిండియా రెడీ అయింది! ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ పోరుకు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆటగాళ్లలో జోష్ నింపారు. మొదటి రోజు నుంచే మానసికంగా, శారీరకంగా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని శుబ్మన్ గిల్ సేనకు స్పష్టం చేశారు.
డబ్ల్యూటీసీ రేసులో ముందంజ వేసేందుకు శ్రీలంక స్పిన్ పిచ్లను ఎదుర్కోవడమే భారత్ ముందున్న ప్రధాన లక్ష్యం. కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్లో ప్రాక్టీస్ షురూ చేసిన భారత్, ఆగస్టు 7 నుంచి 9 వరకు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు జరగనున్నాయి.
ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఏ ప్రశ్నకు అయినా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని గంభీర్ (Gautam Gambhir) జట్టుతో అన్నారు. కాగా, కొత్తగా జట్టులోకి వచ్చిన సారంచ్ జైన్, ఆకిబ్ నబీలతో పాటు ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్ను ఆయన ఆహ్వానించారు.
స్పిన్ను మెరుగ్గా ఎదుర్కొనేందుకు హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, తనుష్ కొటియాన్, విప్రాజ్ నిగమ్లను నెట్ బౌలర్లుగా తెప్పించారు. కాగా, గాయాల కారణంగా బుమ్రా, వాషింగ్టన్ సుందర్లతో పాటు హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఈ సిరీస్కు దూరమయ్యారు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ఐదో స్థానంలో, శ్రీలంక ఆరో స్థానంలో ఉన్నాయి.
Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్సభ ఆమోదం
Follow Us On : WhatsApp

