కలం, నిజామాబాద్ బ్యూరో: దేశానికి స్వాతంత్య్రం ఏర్పడి 79 అవుతోంది. తెలంగాణ రాష్ట్రం.. అవతరించి 12 ఏళ్లుగా జూన్ 2న ఉత్సవాలు కూడా జరుపుకుంటోంది. కానీ నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో మాత్రం కుల వివక్ష.. సామాజిక బహిష్కరణలు, గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు అరాచకాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. వేల్పూరు మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం సభ్యులను స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సామాజిక బహిష్కరణ విధించింది. వేల్పూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం (Gangaputra Community) సభ్యులు ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కు తరలి వచ్చారు. గ్రామంలోని చెరువుల్లో చేపలు పడుతూ జీవిస్తున్నామని కొంతకాలంగా గ్రామంలోని వీడీసీ సభ్యులు తమపై అణచివేతకు పాల్పడుతున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము చేపలు పట్టుకోవడానికి వీడీసీ వారు రూ.50 వేల జరిమానా వేశారని సంఘం సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. ఆ డబ్బులు కట్టకపోవడంతో తమ సంఘంలోని సభ్యులందరిని సాంఘిక బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడీసీపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను వేడుకున్నారు.

