కలం, నిజామాబాద్ బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రోశయ్య చేసిన సేవలు చిరస్మరణీయం అని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Ganesh Bigala) కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొని రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి స్వర్గీయ రోశయ్య ఆదర్శప్రాయమైన నాయకుడని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, వివిధ శాఖల్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా సేవలందించిన ఘనత రోశయ్యదేనని కొనియాడారు. రాజకీయాలకు విలువలు తీసుకొచ్చిన నాయకుడిగా, పరిపాలనలో తనదైన ముద్ర వేసిన మహనీయుడిగా ఆయన ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని గణేష్ బిగాల పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, నాయకులు కె.వి.పి రామచందర్ రావు, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, దానం నాగేందర్, వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, కోలేటి దామోదర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఉప్పల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

