కలం మెదక్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సొంత నియోజకవర్గమైన గజ్వేల్ (Gajwel) ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమకు ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ అందుబాటులో ఉండటం లేదని, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్కు తమ సమస్యలు విన్నవించుకునే అవకాశం లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ‘కేసీఆర్ తమ గ్రామానికి వచ్చాడు’ అంటూ ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రం అందించి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలని, తమ సమస్యలను వినాలని ఆందోళన చేశారు. కాగా వారం రోజుల క్రితమే గజ్వేల్ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

