కలం, మహబూబ్నగర్ బ్యూరో: గద్వాల (Gadwal) ప్రభుత్వాస్పత్రిలో శనివారం ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. వైద్యుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని మృతి చెందినట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఈ ఘటనపై స్వతంత్ర విచారణ కమిటీని నియమించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని ఇందు (17) కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు శుక్రవారం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి అపెండిసైటిస్గా తేల్చారు. ఆపరేషన్ చేసేందుకు గదిలోకి తీసుకెళ్లగా ఆమె మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇందు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు కలెక్టర్ ఆరుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర విచారణ కమిటీని నియమించారు.
మృతురాలికి సంబంధించిన కేసు షీట్, ట్రీట్మెంట్ నోట్స్, ల్యాబోరేటరీ రిపోర్ట్స్ వంటి వివరాలను పరిశీలించి సమగ్రంగా విచారణ చేయాల్సిందిగా కలెక్టర్ సభ్యులను ఆదేశించారు. ఆసుపత్రి పర్యవేక్షకులు, సంబంధిత వైద్యాధికారులు విచారణకు పూర్తి సహకారం కమిటీ సభ్యులకు అందించాలన్నారు. కమిటీ సభ్యులకు సహకరించకుంటే సంబంధిత అధికారులపై నిబంధనల ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిటీ విచారణ అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
Read Also: నీ సంగతి చూస్తా.. కిషన్ రెడ్డికి సీఎం వార్నింగ్
Follow Us On : WhatsApp

