కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లో నేపాలీ ముఠా వరుస చోరీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గచ్చిబౌలీ హిల్ రిడ్జ్ విల్లాస్ లో ఓ వ్యాపారీ ఇంట్లో పని మనుషులగా చేరిన నేపాలీ గ్యాంగ్ భారీ దొంగతనానికి పాల్పడింది. సుమారు 8 కిలోల బంగారు అభరణాలు, కిలో వెండి అపహరించారు. ఈ కేసు (Nepali Theft Gang) ను గచ్చిబౌలీ పోలీసులు ఛేదించారు. ఉత్తరప్రదేశ్ స్థానిక పోలీసులతో కలిసి నిందితులను అరెస్ట్ చేశారు.
కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని హిల్-రిడ్జ్ విల్లాస్లో ఒక విల్లా యజమాని ప్రకాష్ పాయ్ తన కుటుంబంతో కలిసి జూన్ 6న వారి బంధువుల ఇంటికి వెళ్లారు. నెల ముందే ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీ గ్యాంగ్ అవకాశం కోసం వేచి చూశారు.
ఇంట్లో లేని సమయంలో దోపిడికి పాల్పడ్డారు. జూన్ 8 ప్రకాష్ పాయ్ కుమారుడు ఇంటికి వచ్చి, తన దగ్గర ఉన్న తాళంతో లాకర్ను తెరిచి చూడగా, సుమారు 8 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. పలు బృందాలు లభించిన ఆధారాలను విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్లకు ఆరు బృందాలను పంపి, నిందితుల వివరాలు, ఫోటోలను ఆయా రాష్ట్రాల పోలీసుల సాయం కోరారు. ఈ క్రమంలో ఉత్తరాఖాండ్ సరిహద్దుల్లో స్థానిక పోలీసుల సహకారంతో నేపాలీ ముఠాను గచ్చిబౌలీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నిజాలను అంగీకరించారని పోలీసులు తెలిపారు.

