కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని, లేనిచో మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని డిసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్ ,డీజిల్ ధరల తాజా పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలంతా నిలదీయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ఇంధన ధరల పెంపు సామాన్య ప్రజలపై “ఆర్థిక దాడి” అని సంజీవ్ ముదిరాజ్ అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం దోపిడికి పాల్పడుతుందని, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నియంత్రణలో ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అధిక ఎక్సైజ్ సుంకాలను విధిస్తూ ప్రజలపై భారాన్ని మోపుతోందని ఆయన ఆరోపించారు. ఈ పెంపు మార్కెట్ పరిస్థితుల వల్ల వచ్చిన ధరల పెంపు కాదు, పేదలు మధ్యతరగతి ప్రజల జేబులు ఖాళీ చేయడానికి విధిస్తున్న ‘బీజేపీ ట్యాక్స్’ అని ఆయన విమర్శించారు.
డీజిల్ ధరల పెంపు కారణంగా రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పాలు ,ఇతర నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయని పేర్కొన్నారు. ”ప్రతి ఇంటి వంటగది బడ్జెట్ను ఈ ప్రభుత్వం అగ్నికి ఆహుతి చేసింది” అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన “బహుత్ హుయి మెహంగాయీ కి మార్” అనే నినాదాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడది “మెహంగాయీ కి బార్ బార్ వార్”గా మారిందని అన్నారు. ప్రజలను ద్రవ్యోల్బణం నుండి రక్షించాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు.
పెట్రోల్ , డీజిల్ ధరలను ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే తగ్గించాలని సంజీవ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన తక్కువ ధరలు ఉండేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ను ఆయన పునరుద్ఘాటించింది. రాష్ట్రాలతో పంచుకోకుండా కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వివిధ సెస్లు ,సర్చార్జీలను గణనీయంగా తగ్గించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 48 గంటల్లోగా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించకపోతే, జిల్లా వ్యాప్తంగా ‘రాస్తా రోకోలు’ ప్రతి పెట్రోల్ బంక్ వద్ద నిరసనలు చేపడతాము” అని డీసీసీ అధ్యక్షుడు హెచ్చరించారు. ఈ నిర్లక్ష్య ఆర్థిక విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న సామాన్య ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

