కలం, వెబ్డెస్క్: రాష్ట్రపతి పాలన (President’s Rule) ఎత్తివేసి, కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండురోజులైనా గడవలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి (Manipur). ఈ ఘటనలో అల్లరిమూకలు కాల్పులు జరపడంతోపాటు 21 ఇళ్లను తగలబెట్టాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శనివారం రాత్రి ఉఖ్రుల్ జిల్లా లితాన్ సరోయ్ఖోంగ్ గ్రామంలో తాంగ్కుల్ నాగా తెగకు చెందిన ఓ వ్యక్తిని కుకీ తెగకు చెందిన కొంతమంది చుట్టుముట్టి చితక్కొట్టారు. విషయం తెలియడంతో మరుసటి రోజు ఉదయాన్నే గ్రామ పెద్ద ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ కుదిర్చారు. అయితే, ఆ సాయంత్రం మళ్లీ గొడవ చెలరేగి, రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటాక తాంగ్కుల్ తెగవాళ్ల ఇళ్లకు కుకీ వర్గం నిప్పుపెట్టింది. ప్రతిగా ప్రత్యర్థి వర్గమూ అదే పనికి దిగింది.
గొడవ పెరగడంతో గ్రామస్థులు చెల్లాచెదురయ్యారు. కొందరు ఇళ్లలోని సామగ్రి తీసుకొని, గ్రామానికి సరిహద్దులోనే ఉన్న పొరుగు జిల్లాకు తరలివెళ్లారు. విషయం తెలియడడంతో పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించారు. మణిపూర్ (Manipur) ముఖ్యమంత్రి యమ్నం ఖేమ్చంద్ కూడా సోషల్ మీడియా వేదికగా గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఘర్షణల్లో గాయపడినవాళ్లకు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలాగే గొడవలు మరింత పెరగకుండా బలగాలు పహారా కాస్తున్నాయి.
Read Also: నకిలీ హిమాలయ ‘లివ్.52’ ట్యాబ్లెట్స్ తయారీ ముఠా అరెస్ట్
Follow Us On: Sharechat


