కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన మాట తప్పిందని, ఈ సర్కార్కు కరెంట్ షాక్ తగలడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhasker) విమర్శించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు ఆయన మద్దుతు తెలిపారు. హనుమకొండ (Hanamkonda) నక్కలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ కార్యాలయం, ములుగు రోడ్డులోని టీజీ ట్రాన్స్కో కార్యాలయం వద్ద ఉద్యోగులు చేపట్టిన ధర్నా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. దేశంలోనే విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందంటే విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు ప్రధాన కారణమని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల 100 ఏండ్ల సభ సయమంలో కేసీఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. ఆర్టిజన్స్ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను టర్మినేట్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని, ఒక్క ఉద్యోగిని తొలగించినా తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని టర్మినేట్ చేస్తారని హెచ్చరించారు. ఆర్టిజన్స్ ఉద్యమాలకు బీఆర్ఎస్ అండగా ఉండి పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, నాయకులు పులి రజినీకాంత్, గొర్రె విజయ్, ఈసంపెల్లి సంజీవ, గండ్రకోట రాకేశ్ యాదవ్, వీరు, తక్కెళ్లపల్లి వినీల్ రావు, పరుశురాం పాల్గొన్నారు.

