కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజా విప్లవ గాయకుడు, ఉద్యమ కళాకారుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న (Arunodaya Naganna) మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తపరిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగన్న కన్నుమూయడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలోని ఎంఎల్ పార్టీ కార్యాలయంలో ఉంచిన అరుణోదయ నాగన్న పార్థివ దేహాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించి, భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. తన గళంతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన గొప్ప కళాకారుడు అరుణోదయ నాగన్న అని కొనియాడారు. నాగన్న మరణం ప్రజా ఉద్యమాలకు, కళా రంగానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం నాగన్న కుటుంబ సభ్యులను, ఆయన సహచరులను పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విప్లవ గాయకుడిగా నాగన్న చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. నాగన్నకు నివాళులర్పించిన వారిలో పలువురు పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు ఉన్నారు.

