కలం, వెబ్ డెస్క్: ఫాల్కన్ గ్రూప్ (Falcon Group) మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే (Vikas Kumar Sakhare)ను తెలంగాణ సీఐడీ (CID) అధికారులు అరెస్ట్ చేశారు. భారీ డిపాజిట్ మోసం (Deposit Scam) కేసులో ఆయనపై చర్యలు తీసుకున్నారు. “ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్” యాప్ పేరుతో వికాస్ కుమార్ దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యాప్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సుమారు 7,056 మంది డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్లకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 4,065 మంది బాధితులకు దాదాపు రూ.792 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
డిపాజిట్ల సేకరణ కోసం క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఉపయోగించినట్లు విచారణలో తేలింది. పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ప్రజలను ఆకర్షించినట్లు సమాచారం. డిపాజిటర్లకు నకిలీ ఇన్వాయిస్ రసీదులు, ఒప్పంద పత్రాలు చూపించి నమ్మకం కల్పించి డబ్బులు తీసుకున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి క్రైమ్ నంబర్లు 10/2025, 11/2025, 12/2025 కింద కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా మరో 10 కేసులు కూడా నమోదైనట్లు సీఐడీ తెలిపింది. ఈ మోసంలో ప్రధాన నిందితుడు అమర్ దీప్ కుమార్తో వికాస్ కుమార్ (Vikas Kumar Sakhare) కుమ్మక్కయ్యారని ఆరోపణలున్నాయి.
అరెస్ట్ సమయంలో నిందితుడి నుంచి ఒక సెల్ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని డేటాను పరిశీలించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ ఘటనతో పెట్టుబడుల పేరుతో వచ్చే యాప్లు, ఆన్లైన్ స్కీమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అధిక లాభాలకు ఆశపడి తెలియని సంస్థల్లో డబ్బులు పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు.
Read Also: రైల్వే టికెట్ క్లర్క్కి బుద్ధి చెప్పిన యువతి.. ఉద్యోగమే ఊడిపోయింది!
Follow Us On: Sharechat

