కలం, హనుమకొండ: ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో(Bhadrakali Temple) శాఖాంబరి ఉత్సవాలు(Shakambari Utsavam) బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, అధికారికంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ఆలయ మర్యాదలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ మహాగణపతి, శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పవిత్ర సంప్రదాయంలో భాగంగా ఈ ఏడాది శాఖాంబరి ఉత్సవాలను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి కరువు తొలగిపోవాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాల నిర్వహణలో భక్తుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయ నిర్వాహకులకు సహకరించాలని భక్తులను కోరారు. భద్రకాళి అమ్మవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఆలయ ప్రధాన అర్చకులు శేషు, నాయకులు ఆంజనేయులు, పూర్ణ, సతీష్, వీరన్నతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

