కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లాలోని జన్మభూమి నగర్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ గ్యాస్ట్రో ఆసుపత్రి (Mancherial Hospital)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద తీవ్రత కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక చర్యలు కొనసాగుతుండటంతో ఆ ప్రాంతంలో భారీగా జనం గుమిగూడారు.

