కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ (Nizamsagar) ప్రాజెక్టులో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన కృష్ణ(32) తన కుమారుడు రక్షిత్ (9), కుమార్తె అనన్య (5)తో కలిసి గురువారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్దకు వచ్చాడు. సాయంత్రం వరకు ప్రాజెక్ట్ వద్ద పిల్లలతో సరదాగా గడిపాడు. అనంతరం ముగ్గురు అక్కడ భోజనాలు సైతం చేశారు. ఒక్కసారిగా సాయంత్రం పూట ఇద్దరు పిల్లలను తండ్రి నీటిలో తోసేసి తాను కూడా దూకాడు. కుటుంబ కలహాల కారణంగా ఆయన పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. శుక్రవారం ఉదయం ఆరేడు శివారులోని 20 గేట్ల వద్ద మృతదేహాలు లభ్యమయ్యాయి. ముగ్గురి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువుల తీవ్రంగా రోదించారు. ముక్కుపచ్చలారని ఆ పసి పిల్లలు ఏం పాపం చేశారని గుండెలవిసేలా రోదించడం అందరినీ కలిచి వేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.

