కలం, మహబూబ్ నగర్ బ్యూరో : నేర ప్రవృత్తి కలిగిన నేతలను చట్టసభల నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఎన్ఎఫ్ఐడబ్ల్యు మహబూబ్ నగర్ జిల్లా 12వ మహాసభలు ఘనంగా ముగిశాయి.
ముగింపు సభలో రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన మాట్లాడుతూ.. మహిళా బాధితులకు న్యాయం చేయడం కోసం స్వయం ప్రతిపత్తితో నిర్మితమైన జాతీయ, రాష్ట్ర మహిళ కమిషన్స్ పాలకవర్గాల ఆధిపత్యం నుండి బయటకు రావాలని కోరారు. మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హింస, అఘాయిత్యాలు, దురాక్రమణలకు, ప్రతి అన్యాయాలను మహిళా కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించాలన్నారు.
నిందితులను కఠిన శిక్షలు పడేవిధంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. సమాజంలో మహిళలు ఇప్పటికీ జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లలేని కట్టుబాట్ల రుగ్మతలు కొనసాగుతున్నాయని,న్యాయం కోసం గడప దాటిన మహిళలను మానసిక క్షోభకు గురయ్యే విధంగా హేళన జరుగుతుందని అన్నారు. హక్కుల సాధనకు మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఎన్ఎఫ్ఐడబ్ల్యు మహబూబ్ నగర్ నూతన జిల్లా సమితి ఎన్నిక
ఎన్ఎఫ్ఐడబ్ల్యు 12వ జిల్లా మహాసభలో మహబూబ్ నగర్ జిల్లా గౌరవాధ్యక్షురాలిగా శ్యామల, జిల్లా అధ్యక్షురాలుగా జి.భార్గవి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండికంటి పద్మావతి, కోశాధికారిగా ఎం.ఇందిర, జిల్లా ఉపాధ్యక్షురాలు సువర్ణ, కారూరు అంజమ్మ, సహాయ కార్యదర్శిగా అరుణ లతో పాటు జిల్లా సమితి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్, ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా నేతలు భార్గవి కొండికంటి పద్మావతి, గాయని శ్యామల, ఇందిరా,పుష్ప,గీత, శారద,స్రవంతి, పద్మ హ,నాగమణి,లక్ష్మమ్మ, సుగుణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పీ. సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, మహేష్,గూడు భాష, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

